Priyanka Gandhi: రాయ్ బరేలీ నుంచి ప్రియాంక ఎన్నికల అరంగేట్రం!

  • అమేథీలోనూ పోటీ చేయనున్న రాహుల్ గాంధీ
  • రాయ్ బరేలీ, అమేథీలో నేటి నుంచి మొదలైన నామినేషన్ ప్రక్రియ
  • వచ్చే నెల 1 నుంచి 3వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్, ప్రియాంక
Priyanka Gandhi To Make Poll Debut From Rae Bareli And Rahul To Take Amethi As 2nd Seat

కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా, గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ లోక్ సభ స్థానంలో అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో గాంధీ కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు నిలబడుతూ వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవలేనంటూ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో రాయ్ బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. 

తాజాగా ఈ సస్పెన్స్ వీడిందని, రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ తన కూతురు ప్రియాంక గాంధీని నిలబెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపై చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు చేపడతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం దాదాపుగా కన్ఫార్మ్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోనే కాంగ్రెస్ పార్టీకి నిన్నమొన్నటి వరకు గట్టి పట్టున్న మరో నియోజకవర్గం అమేథీ.. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వరుసగా లోక్ సభకు ఎంపికవుతూ వస్తున్నారు. అయితే, ఆయన జైత్రయాత్రకు బీజేపీ కిందటి ఎన్నికల్లో చెక్ పెట్టింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ బరిలో నిలబెట్టి రాహుల్ గాంధీని ఓడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడినా, వయనాడ్ నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. కిందటి ఎన్నికల లాగే ఈసారి కూడా రాహుల్ గాంధీ రెండుచోట్లా పోటీ చేస్తారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. అమేథీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ బావ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భావిస్తున్నారు. దీంతో ఈ సీటు కేటాయింపుపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

శుక్రవారం జరుగుతున్న రెండో దశ పోలింగ్ తర్వాత అమేథీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా, రాహుల్ గాంధీ మరోమారు ఇక్కడి నుంచి పోటీ చేస్తారని కన్ఫార్మ్ అయిందని సమాచారం. రాయ్ బరేలీ తోపాటు అమేథీ నియోజకవర్గంలో కూడా శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సీట్లలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ చేయడం దాదాపు కన్ఫార్మ్ అయిందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి 3వ తేదీలోగా రాహుల్, ప్రియాంక గాంధీలు తమ నామినేషన్లు దాఖలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్, ప్రియాంకలు అయోధ్య రామ మందిరం వెళ్లి బాలక్ రామ్ ను దర్శించుకుంటారని పేర్కొన్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, అమేథీలోని రాహుల్ గాంధీ నివాసంలో మరమ్మతులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

More Telugu News